మహారాష్ట్రలోని కల్యాణ్ టౌన్లో రైల్వే రిటైర్డ్ ఉద్యోగిని పెన్షన్ వివరాల పేరుతో మోసం చేసి సైబర్ నేరగాళ్లు 7 లక్షల రూపాయలు దోచుకున్నారు. ఫోన్ కాల్ సమయంలోనే ఆయన మొబైల్ను హ్యాక్ చేసి నగదు మళ్లించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మహారాష్ట్రలో ఒక షాకింగ్ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ముంబై బైకులా రైల్వే ఆసుపత్రిలో వార్డ్ బాయ్గా పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగి ఖాతా నుండి సైబర్ నేరగాళ్లు 7 లక్షల రూపాయలను దోచుకున్నారు. డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) కార్యాలయం నుండి మాట్లాడుతున్నట్లు నమ్మబలికి ఈ మోసం చేశారు.
మే 5న జరిగిన ఈ ఘటనలో, నిందితులు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO) నంబర్ను ధృవీకరించాలని కోరి ఫోన్ చేశారు. బాధితుడి కుమార్తె పెన్షన్ ఫైళ్లు ప్రస్తుతం అందుబాటులో లేవని చెప్పగానే వారు ఫోన్ కట్ చేశారు. అయితే, ఎలాంటి బ్యాంకింగ్ వివరాలు పంచుకోకపోయినా, అకస్మాత్తుగా ఖాతా నుండి 7 లక్షల రూపాయలు మాయమయ్యాయి.
సంభాషణ జరుగుతున్న సమయంలోనే సైబర్ నేరగాళ్లు బాధితుడి మొబైల్ను హ్యాక్ చేసి బ్యాంక్ వివరాలను సేకరించి ఉండవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. భారత న్యాయ సంహిత మరియు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.