అమృత్సర్ రూరల్ పోలీసులు 690 గ్రాముల ఐఈడీని స్వాధీనం చేసుకుని, పోలీస్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని పన్నిన ఉగ్రవాద కుట్రను భగ్నం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ రికవరీ జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
పంజాబ్లోని అమృత్సర్ రూరల్ పోలీసులు పోలీస్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని పన్నిన ఒక పెద్ద ఉగ్రవాద కుట్రను విజయవంతంగా భగ్నం చేశారు. శనివారం, ఆదివారం మధ్య రాత్రి జరిపిన తనిఖీల్లో ఎలక్ట్రానిక్ డెటొనేటర్తో కూడిన 690 గ్రాముల ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్) ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి ఆ పేలుడు పదార్థాన్ని సురక్షితంగా నిర్వీర్యం చేసింది.
పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ రికవరీలో బ్యాటరీ, టైమర్ మరియు ఐరన్ బాక్స్ కూడా ఉన్నాయి. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కుల్బీర్ సింగ్ పెట్రోలింగ్లో ఉండగా, గగ్గోమహల్ పోలీస్ పోస్ట్ పరిధిలో అనుమానాస్పదంగా ఉన్న నల్లటి ప్యాకెట్ కనిపించింది. దాన్ని పరిశీలించగా అందులో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు.
స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో అమృత్సర్ రూరల్ ఎస్పీ కన్వల్ప్రీత్ సింగ్ చాహల్ ఆధ్వర్యంలో గట్టి భద్రత, నిఘా ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై అమృత్సర్ రూరల్ పరిధిలోని రామ్దాస్ పోలీస్ స్టేషన్లో ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.