నల్ల సముద్రం మరియు దాని పరిసర ప్రాంతాల్లోని వాణిజ్య నౌకల్లో పనిచేసే భారతీయ నావికులు భద్రతా రిస్క్‌లను జాగ్రత్తగా అంచనా వేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) సూచించింది. ఓడెసా పోర్టులో ఎంవీ ఏజీఎన్ రాగ్నార్ (MV AGN Ragnar) నౌకపై దాడి జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఉక్రెయిన్‌లోని ఓడెసా పోర్టులో భారతీయ సిబ్బంది ఉన్న ఎంవీ ఏజీఎన్ రాగ్నార్ (MV AGN Ragnar) అనే సరుకు రవాణా నౌకపై ప్రొజెక్టైల్ దాడి జరిగిన మరుసటి రోజే భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. నల్ల సముద్రం మరియు దాని చుట్టుపక్కల సముద్ర ప్రాంతాలలో నడుస్తున్న వాణిజ్య నౌకలలో ఉద్యోగాల కోసం వెళ్లే భారతీయ నావికులు, అక్కడ ఉన్న భద్రతా ప్రమాదాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించింది.

ఈ దాడిలో నౌకలో ఉన్న నలుగురు భారతీయులలో ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు, మిగిలిన ఇద్దరి గురించి సమాచారం కోసం ఎదురుచూస్తున్నట్లు కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఏప్రిల్ నుండి ఈ ప్రాంతంలో డ్రోన్ మరియు క్షిపణి దాడులు పెరగడం వల్ల ఇప్పటికే ఐదుగురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఉద్యోగదారులు మరియు రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల నుండి నౌక యొక్క మార్గం, భద్రతా ఏర్పాట్లు, బీమా మరియు అత్యవసర పరిస్థితుల్లో సహాయం పొందే విధానాల గురించి పూర్తి సమాచారాన్ని సేకరించాలని భారత పౌరులకు సూచించింది. వాణిజ్య నౌకలు మరియు నావికులపై ఏ పరిస్థితుల్లోనూ దాడి చేయకూడదని భారత్ స్పష్టం చేసింది.