పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురి జిల్లాలో టీ తోటలో పని చేస్తున్న రైతు దీపాంకర్ గోపేను సుమారు 20 మంది బంగ్లాదేశీయులు కిడ్నాప్ చేశారు. పగ తీర్చుకోవడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురి జిల్లా రాజ్గంజ్ బ్లాక్కు చెందిన 35 ఏళ్ల దీపాంకర్ గోపే అనే రైతును బంగ్లాదేశీ ముఠా కిడ్నాప్ చేసింది. శనివారం ఉదయం ఆయన తన టీ తోటలో పురుగుమందులు చల్లుతుండగా, సరిహద్దు దాటి వచ్చిన సుమారు 20 మంది సాయుధ బంగ్లాదేశీయులు ఆయనను చుట్టుముట్టి, బలవంతంగా సరిహద్దు దాటించి బంగ్లాదేశ్లోని పంచగఢ్కు తరలించారు.
ఇటీవలే ఒక బంగ్లాదేశీ పౌరుడిని సరిహద్దు దాటకుండా బిఎస్ఎఫ్ (BSF) అధికారులు అడ్డుకోవడంతో, ఆ చర్యకు ప్రతీకారంగా ఈ కిడ్నాప్ జరిగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బిఎస్ఎఫ్ మరియు బిజిబి (BGB) అధికారులు చర్చలు జరుపుతున్నారు. రైతు క్షేమంగా తిరిగి రావాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.