పుణె కోర్టులో జరుగుతున్న రాహుల్ గాంధీ అవమాన కేసులో వినాయక్ దామోదర్ సవర్కర్ మనవడు సత్యకి సవర్కర్ కీలక ప్రకటన చేశారు. దైవం మరియు మతపరమైన ఆచారాలపై సవర్కర్ చేసిన విమర్శలు ఆయన రాసినవేనని సత్యకి కోర్టులో ధృవీకరించారు.
మహారాష్ట్రలోని పుణెలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై నమోదైన క్రిమినల్ పరువు నష్టం కేసులో హిందుత్వ మేధావి వినాయక్ దామోదర్ సవర్కర్ రాసిన పుస్తకాలు చర్చనీయాంశమయ్యాయి. సవర్కర్ మనవడు సత్యకి సవర్కర్, స్పెషల్ జడ్జి అమోల్ షిండే ముందు విచారణలో మాట్లాడుతూ.. దేవుడు, మతపరమైన ఆచారాలు మరియు సంప్రదాయ విశ్వాసాలపై సవర్కర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నిజంగానే సవర్కర్ రాసినవేనని అంగీకరించారు. 2023 మార్చిలో లండన్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది.
సవర్కర్ తన 'సైంటిఫిక్ ఎస్సేస్' (శాస్త్రీయ వ్యాసాలు) పుస్తకంలో మూఢనమ్మకాలను విమర్శించారని, మతం అనేది ఆచారాల కంటే శాస్త్రీయ తర్కంపై ఆధారపడాలని వాదించారని కోర్టులో తేలింది. దైవశక్తులు ఉంటే మధ్యయుగ ముస్లిం దాడుల సమయంలో దేవాలయాలను ఎందుకు రక్షించలేవునని సవర్కర్ ప్రశ్నించిన అంశం కూడా బయటపడింది. గాంధీ తరపు న్యాయవాది సమర్పించిన అంశాలు సవర్కర్ రాసినవేనని సత్యకి కోర్టులో స్పష్టం చేశారు.