అక్రమ వలసల వల్ల వచ్చే జనాభా మార్పులను అధ్యయనం చేయడానికి రిటైర్డ్ జడ్జి ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ జమ్ములోని వివిధ వర్గాలతో చర్చలు జరిపింది.

జనాభా మార్పులను అధ్యయనం చేసే ఉన్నత స్థాయి కమిటీ మంగళవారం జమ్ములోని నాగ్రోటా ప్రాంతంలో ఉన్న జగతీ మైగ్రెంట్ టౌన్‌షిప్‌ను సందర్శించింది. ఇక్కడ 5,000 కంటే ఎక్కువ కాశ్మీరీ పండిట్ కుటుంబాలు నివసిస్తున్నారు. నివాసితుల సమస్యలను, వారి సూచనలను కమిటీ నిశితంగా పరిశీలించిందని రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కమిషనర్ అరవింద్ కర్వాణి తెలిపారు.

ఈ పర్యటనలో భాగంగా కమిటీ నర్వాల్ ప్రాంతంలోని రోహింగ్యా వలసదారుల మురికివాడలను కూడా తనిఖీ చేసింది. అలాగే పాకిస్థాన్ ఆక్రమిత జమ్ము కాశ్మీర్ శరణార్థుల ప్రతినిధి బృందంతో చర్చలు జరిపింది. అక్రమ వలసల కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసి, తగిన చర్యలను సూచించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.