భూ హక్కుల కార్యకర్త ప్రణబ్ డోలీ బెయిల్ పొందిన తర్వాత, అస్సాం ప్రభుత్వం అతనిపై జాతీయ భద్రతా చట్టాన్ని (NSA) వినియోగించిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇది ప్రజాస్వామ్య స్వతంత్రాన్ని అణచివేసే ప్రయత్నమని జైరామ్ రమేష్ పేర్కొన్నారు.
భూ హక్కుల కార్యకర్త ప్రణబ్ డోలీకి కోర్టు బెయిల్ మంజూరు చేసిన మరుసటి రోజే, అస్సాం ప్రభుత్వం అతనిపై జాతీయ భద్రతా చట్టాన్ని (NSA) అమలు చేసిందని కాంగ్రెస్ ఆదివారం ఆరోపించింది. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ విమర్శించింది.
కాజిరంగ్రా నేషనల్ పార్క్ సమీపంలో ప్రతిపాదిత ఫైవ్ స్టార్ రిసార్ట్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గ్రామస్థుల నిరసనలకు మద్దతుగా నిలిచినందుకు డోలీని అరెస్టు చేశారు. జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ, అస్సాం ప్రభుత్వం NSA ద్వారా అతడిని అదుపులోకి తీసుకోవడం చట్టాల దుర్వినియోగమని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేష్ అన్నారు.
అస్పష్టమైన మరియు ఊహాజనిత ఆరోపణల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రమేష్ మండిపడ్డారు. కోర్టు ఉత్తర్వులను తప్పించుకోవడానికి మరియు వ్యక్తులను నిర్బంధంలో ఉంచడానికి అసాధారణ చట్టాలను ఉపయోగించడం చట్టబద్ధమైన పాలనకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.