మస్కాట్‌లో జరిగిన యూత్ హాకీ 5s ఆసియా ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌ను 3-1 తేడాతో ఓడించి భారత సబ్-జూనియర్ పురుషుల జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఈ విజయంతో భారత్ వచ్చే ఏడాది జరిగే FIH యూత్ హాకీ 5s ప్రపంచ కప్ క్వాలిఫై చేసింది.

మస్కాట్‌లో శనివారం జరిగిన యూత్ హాకీ 5s ఆసియా ఛాంపియన్‌షిప్ 2026 ఫైనల్‌లో భారత సబ్-జూనియర్ పురుషుల హాకీ జట్టు పాకిస్తాన్‌పై 3-1తో ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించింది. రోమిత్ పాల్, కెప్టెన్ కేతన్ కుష్వాహా మరియు షారుక్ అలీ గోల్స్‌తో భారత్ పట్టు సాధించింది. ఈ టోర్నమెంట్ మొత్తం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ ఛాంపియన్‌గా నిలిచింది మరియు రాబోయే FIH యూత్ హాకీ 5s వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది.

మరోవైపు, భారత సబ్-జూనియర్ మహిళా జట్టు చైనాతో జరిగిన ఫైనల్‌లో ఓడి వెండి పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ అద్భుత ప్రదర్శనకు గాను హాకీ ఇండియా పురుషుల జట్టు ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, మహిళల జట్టు ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ. 1 లక్ష నగదు బహుమతిగా ప్రకటించింది.